home page

ఠానా కు వచ్చే వారి పట్ల మర్యాద ఉండాలి :అంజనీ కుమార్

పోలీసులకు డీజీపీ సూక్తులు 

 | 
Anjani kumar dgp telangana
ఠాణాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా ఉండాల్సిందే: డీజీపీ
 సామాజిక మాధ్యమాల్లో సమాచార విస్తృతి దృష్ట్యా పోస్టింగ్‌లపై నిఘా పెంచాలని డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశించారు. ప్రతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పర్యవేక్షణ విభాగాన్ని పటిష్ఠం చేయడంతో పాటు తప్పుడు పోస్టింగ్‌లపై తక్షణ చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ నిమిత్తం వచ్చిన కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఠాణాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీల సమావేశాలు, పాదయాత్రలు ముమ్మరం అవుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈక్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఫిబ్రవరి నెలలో ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యటన బాగుందని కితాబిచ్చారు. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగే హాట్‌స్పాట్లలో నియంత్రణ చర్యలతో పాటు రోడ్డు నిర్మాణ లోపాలను సవరించేందుకు రహదారులు, భవనాల శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సైబర్‌ నేరాల విస్తృతి దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఠాణాలో పదిమంది చొప్పున సైబర్‌ యోధులను తయారు చేయాలని ఆదేశించారు. సైబర్‌నేరాల దర్యాప్తుపై నలుగురు కానిస్టేబుళ్లకు అధునాతన శిక్షణ ఇవ్వాలని సూచించారు. రంజాన్‌ మాసం నేపథ్యంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలోని అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
డీజీపీ కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు డీజీపీలు మహేశ్‌భగవత్‌, సంజయ్‌కుమార్‌జైన్‌, విజయ్‌కుమార్‌, శిఖా గోయెల్‌, సందీప్‌శాండిల్య, రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. Anjani kumar