ఆంధ్ర -తెలంగాణ మధ్య ఐకానిక్ బ్రిడ్జి త్వరలో నిర్మాణం
ఇది ప్రగతి హైవే : గడ్కరీ

ఢిల్లీ, : భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ నడుమ నిర్మించబోతున్నారు.
కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే దీనిని పూర్తిచేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ట్విటర్లో ప్రకటించారు. ''ప్రగతి కా హైవే'' అనే హ్యాష్ ట్యాగ్తో ఆయన ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా-కర్నూలు జిల్లా మధ్య సోమశిల వద్ద ఇది నిర్మితం కానుంది. ఇది పూర్తయితే ప్రపంచంలో రెండోది..
దేశంలో మొదటిది అవుతుందని.. హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. దీనికి తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటాయని.. వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందన్నారు.
ఈ వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్ వాక్వే ఉంటుందన్నారు. తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఏపీకి నేరుగా వెళ్లాలంటే పడవలో ప్రయాణించాల్సిందే. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 100 కిలోమీటర్లు అవుతుంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వెళ్లేవారు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు.