home page

రాంగ్ పార్కింగ్ : వెయ్యి జరిమానా

ఫోటో పంపితే 500 నగదు ఖాతాలో జమ

 | 
Gadkari

కేంద్రం మదిలో కొత్త ఆలోచన

దేశంలో ప్రధాన పట్టణాల్లో పార్కింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దుకాణాలకు వెళ్లినప్పుడు, హోటల్స్ కు వెళ్లినప్పుడు , వేరే పనులపై బయటకు వెళ్లినప్పుడు ఇక్కట్లు తప్పడం లేదు.

పార్కింగ్ సౌకర్యం సరిగా లేకపోవటంతో రోడ్డుపైన, రాంగ్ పార్కింగ్ ప్లేస్ లో మన వాహనాలను నిలుపుతుంటాం. అయితే ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అటుగా వస్తే ఫైన్ పడుతుంది. లేకుంటే ఫైన్ లేకుండానే ఇంటికి వచ్చేస్తాం. కానీ ఇప్పుడు మీరు అలర్ట్ గా ఉండాల్సిందే… మీ వాహనం రాంగ్ పార్కింగ్ చేశారో.. మీకు రూ. వెయ్యి జరిమానా పడిపోయినట్లే. ప్రధాన పట్టణాల్లో రాంగ్ పార్కింగ్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త స్కీంను అమల్లో తెచ్చేందుకు సిద్ధమవుతుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దీనికోసం ఓ చట్టం తీసుకురానున్నట్లు ఆయన గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలిపాడు.

ఇక నుంచి ఎవరైన పార్కింగ్ లేని ప్రదేశంలో వాహనం పార్కింగ్ చేస్తే.. కచ్చితంగా ఫైన్ పడుతుంది. కేంద్రం త్వరలో అమల్లోకి తేనున్న కొత్త స్కీంలో.. రాంగ్ పార్కింగ్ లో మీరు వాహనాన్ని నిలిపితే.. ఎవరైనా ఆ వాహనాన్ని, నెంబర్ ప్లేట్ ను ఫొటోలు తీసి రవాణాశాఖకు పంపిస్తే చాలు.. వాహనదారుడికి రూ. వెయ్యి జరిమానా పడటంతో పాటు, ఫోటో తీసి పంపించిన వ్యక్తికి రూ. 500 తన అకౌంట్ లో జమ అవుతాయి. ఈ తరహాలో కొత్త స్కీంను అమల్లోకి తెచ్చేందుకు ఓ చట్టంను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు, అప్పుడే రాంగ్ పార్కింగ్ కు చెక్ పెట్టొచ్చని గడ్కరీ తెలిపారు.

పార్కింగ్ స్థలాల్లో కాకుండా రహదారులపై కొందరు వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేస్తుండటం పట్ల గడ్కరీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాగ్ పూర్ లోని తన వంటవాడికి రెండు వాహనాలు ఉన్నాయని, ఒక్కో కుటుంబానికి ఆరేసి వాహనాలు ఉంటున్నాయని చెప్పారు. ఈ విషయంలో ఢిల్లీ వాసులు అదృష్ట వంతులని, పార్కింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా రహదారులు ఉన్నాయంటూ గడ్కరీ పేర్కొన్నారు.