home page

పట్టా లెక్కని పేదల రైళ్ళు

ఇది మోడీ సర్కారు -ధనవంతుల ప్రభుత్వం 

 | 
Modi
*పట్టాలెక్కని పేదల రైళ్లు* 
 *40 ప్యాసింజర్‌ రైళ్ల పునరుద్ధరణ ఏమైంది?..*
పట్టించుకోని దక్షిణ మధ్య రైల్వే అధికారులు
కరోనాకు ముందు 70కిపైగా రైళ్ల రాకపోకలు
ప్రస్తుతం నడుస్తున్నది 30 ప్యాసింజర్‌ రైళ్లే
సాధారణ పరిస్థితులు నెలకొన్నా చిన్నచూపే
తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పేదల రైళ్లు పట్టాలెక్కడం లేదు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వందలాది రైలు సర్వీసులను పునరుద్ధరించిన రైల్వే అధికారులు.. ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సమీప పట్టణాలకు నిత్యం రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 21 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయిన విషయం తెలిసిందే. అదే ఏడాది జూన్‌ 10 నుంచి క్రమక్రమంగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రిజర్వ్‌డ్‌ టికెట్లు ఉన్న వారినే ప్రయాణానికి అనుమతించిన రైల్వే శాఖ.. 2021 డిసెంబరులో ఆ విధానాన్ని ఎత్తివేసి బుకింగ్‌ కౌంటర్ల ద్వారా టికెట్లను విక్రయుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా స్టేషన్లలో కరోనాకు ముందున్న పరిస్థితులు నెలకొన్నాయి. రోజు వారీ ప్రయాణాలు పెరిగాయి. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 250 రైళ్ల ద్వారా సుమారు 3.20లక్షల మంది నిత్యం ప్రయాణిస్తున్నారు. కరోనాకు ముందు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని డివిజన్లలో కలిపి 70కిపైగా ప్యాసింజర్‌ రైళ్లు నడిచేవి. 
కానీ, ఇప్పుడు వాటి సంఖ్యను 30కి కుదించారు. ఇలా సుమారు 40కిపైగా ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించకుండా గాలికి వదిలేశారు. చిన్న స్టేషన్లలోనూ ఆగే ప్యాసింజర్‌ రైళ్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. . ఆఫీసులతోపాటు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం వందలాది మంది ఈ రైలును ఆశ్రయించే వారు. అలాంటి రైలును పునరుద్ధరించకపోవడంతో హైదరాబాద్‌లో చిన్న పాటి ఉద్యోగాలు చేసుకునే వారు ఇబ్బందులు పడుతూ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో వచ్చి వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొని, రవాణా వ్యవస్థలన్నీ ఊపందుకున్నప్పటికీ సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో 40కిపైగా ప్యాసింజర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురాకపోవడంలో ఆంత్యరమేంటని ప్రయాణికుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. రైళ్లను పునరుద్ధరించాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్యాసింజర్‌ రైళ్లను అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు.