జమ్మూ కు 43, కాశ్మీర్ కు 47 నియోజకవర్గాలు ఏర్పాటు
డీలిమిటేషన్ పూర్తి చేసిన కమిషన్
వ్యతిరేకత వ్యక్తం చేసిన ముఫ్తీ మెహబూబా
-కేంద్రం నోటిఫై చేసిన తేదీ నుంచి అమలులోకి
కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది.
డీలిమిటేషన్ కమిషన్ తన పదవీ కాలం పూర్తయ్యేందుకు ఒకరోజు ముందే ఈ పని పూర్తి చేసింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశారు నేతృత్వంలోని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, జమ్ము కాశ్మీర్ ఎన్నికల కమిషనర్ కెకె శర్మలతో కూడిన జమ్మూకాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ఆర్డర్ను ఖరారు చేసి, తుది ఆర్డర్స్పై సంతకాలు చేసింది. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్డర్ కాపీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి డీలిమిటేషన్ అమలులోకి వస్తుంది.
డీలిమిటేషన్ చట్టం - 2002లోని సెక్షన్ 9(1)(ఎ), సెక్షన్ 60(2)(బి)లోని నిబంధనలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన చేసినట్లు కమిషన్ తెలిపింది. జమ్ముకాశ్మీర్లోని అసెంబ్లీ స్థానాల సంఖ్యను 83 నుంచి 90కి పెంచాలని, అందులో 43 జమ్మూ ప్రాంతానికి, 47 కాశ్మీర్ ప్రాంతానికి కేటాయిస్తూ ప్రతిపాదించింది. జమ్ములో 6 స్థానాలు, కాశ్మీర్లో ఒక స్థానం కమిషన్ అదనంగా ప్రతిపాదించింది. చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ)కు తొమ్మిది సీట్లు కేటాయించింది. వీటిలో 6 జమ్ము ప్రాంతంలోనూ, 3 కాశ్మీర్ లోయలో ఉన్నాయని కమిషన్ పేర్కొంది. జమ్ము కాశ్మీర్లో ఐదు లోక్సభ నియోజకవర్గాలున్నాయి. డీలిమిటేషన్ కమిషన్ జమ్ము కాశ్మీర్ ప్రాంతాన్ని ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించింది. దీంతో, లోయలోని అనంతనాగ్ ప్రాంతాన్ని, జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్లను కలిపి పార్లమెంటరీ నియోజకవర్గం ఒకటి రూపొందించింది. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సమాన సంఖ్యలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయని కమిషన్ తెలిపింది. కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా మార్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని తెలిపింది.
అశాస్త్రీయంగా డీలిమిటేషన్ : సిపిఎం
దీర్ఘకాలంలో జమ్ము కాశ్మీర్ ప్రజలను నిర్వీర్యం చేయడానికి డీలిమిటేషన్ కసరత్తు జరిగిందని సిపిఎం విమర్శించింది. ఈ మేరకు గురువారం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్ తరిగామి ఒక ప్రకటన విడుదల చేశారు. లోక్సభ, అసెంబ్లీ సీట్ల పెంపుదల, తగ్గింపుపై రాజ్యాంగ స్తంభన ఉన్నప్పటికీ డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను సమర్పించిందని విమర్శించారు. 2002 నాటి డీలిమిటేషన్ చట్టం ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైనప్పటికీ, జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని అన్నారు. జమ్ము కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 నిబంధనలకు అనుగుణంగా సుప్రీం కోర్టులో సవాలు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి శాశ్వత నివాసితులకే పరిమితం చేయబడిన ఓటింగ్ హక్కులు రాష్ట్రేతరులకు కూడా విస్తరించాయని తెలిపారు.
అంగీకరించబోం: మెహబూబా ముఫ్తీ, పిడిపి
డీలిమిటేషన్ ప్రక్రియపై పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని ఎంత మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రజల ఇష్టాఇష్టాలు రాజకీయ పార్టీల అభిప్రాయాలతో సంబంధం లేకుండా బిజెపి ఆదేశాలతో ఈ డీలిమిటేషన్ జరిగిందని ముఫ్తీ విమర్శించారు.