home page

రాజకీయ విద్వేషాలు ప్రమాదం :సిజెఐ

 | 

రాజకీయ విద్వేషాలు ప్రమాదం:సిజెఐ రమణ

ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ
జైపూర్ : రాజకీయ వైరం చిలికిచిలికి విద్వేషాల స్థాయికి చేరడం ఇప్పటి పరిణామమని ఇది దేశ ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తెలిపారు.శనివారం ఆయన ఇక్కడ రాజస్థాన్ అసెంబ్లీ వద్ద కామన్‌వెల్తు పార్లమెంటరీ అసోసియేషన్ నిర్వహిచిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఉనికి కోసం చేసుకునే విమర్శల స్థాయిలు చివరికి గిరిదాటి పరస్పర విద్వేషాల ఆవేశకావేశాల స్థాయికి చేరుతున్నాయని , ద్వేష భావనకు ప్రజాస్వామ్యంలో తావుండరాదని అన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వపక్షం, విపక్షాల మధ్య పరస్పర గౌరవనీయ భావం ఉండేది. అయితే ఇది అంతరించిపోతోందన్నారు. ఇది బాధాకర పరిణామానికి దారితీస్తుందని సిజెఐ తెలిపారు. చట్టసభల నిర్వహణ తీరుతెన్నుల ప్రమాణాలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు తీసుకురావడం వీటిపై సరైన స్క్రూటినిలు చర్చలు లేకుండానే ఆమోదాలతో కొత్త చట్టాలు రూపొందడం జరుగుతోందన్నారు. ఇది ప్రజాస్వామ్యమన్పించుకుంటుందా? అని సభికులను ప్రశ్నించారు.
అరెస్టులు, దక్కని బెయిల్స్‌పై తక్షణ దృష్టి
కీలక అంశాలను ప్రస్తావించిన చీఫ్ జస్టిస్
తొందరపాటు విచక్షణారహిత అరెస్టులు, బెయిల్ పొందడంలో క్లిష్టతలు, దీర్ఘకాలం విచారణ లేకుండా ఖైదీలుగా ఉంచడం వంటి అంశాలు ఇప్పుడు అత్యంత తక్షణ కీలక ప్రస్తావనాంశాలని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు కూడా హాజరైన సభలోనే ప్రసంగించిన చీఫ్ జస్టిస్ ఈ విషయాలను ప్రధానంగా పేర్కొన్నారు. అల్ట్‌న్యూస్ జర్నలిస్ట జుబెయిర్ అరెస్టు తరువాత ఇప్పటికీ సరైన బెయిల్ దక్కకపోవడం వంటి అంశాలపై విమర్శలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్రలో నటి కేతకి చితాలే నిర్బంధం కూడా వివాదాస్పదం అయింది. అయితే నిర్థిష్టంగా ఏ ఉదంతాన్ని ప్రస్తావించకుండా సిజెఐ న్యాయవ్యవస్థ తక్షణ జోక్యానికి అవసరమైన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. దేశ నేర న్యాయ స్మృతి చిట్టచివరికి ఓ శిక్ష అవుతోందని వ్యాఖ్యానించారు. మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని ప్రక్రియనే పలు సవాళ్లు ఇమిడి ఉన్నాయి. తొందరపాటు అరెస్టులు జరగడం, బెయిల్ నిరాకరణలు, అండర్ ట్రయల్స్‌గా ఎక్కువకాలం మగ్గడం వంటివి ప్రధాన అంశాలు అయ్యాయని, వీటిపై తక్షణం దృష్టిసారించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై జాతీయ చట్ట సేవల అధీకృత సంస్థ (నల్సా) లీగల్ సర్వీస్ అథార్టీలు ప్రధానంగా పరిశీలించాల్సి ఉంటుందని, ఏ విధంగా ఈ జంజాటాల నుంచి పరిష్కారం దక్కుతుందనేది ఆలోచించాలని సూచించారు. ఖైదీల సత్వర విడుదలకు పద్ధతిని క్రమబద్ధీకరించేందుకు ఓ బెయిల్ యాక్ట్ తీసుకురావాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిన అంశాన్ని చీఫ్ జస్టిస్ ప్రస్తావించారు.