home page

బిజెపిపై ఆప్ అవినీతి అస్త్రం

 | 
Aap vs bjp

అస్సాం సీఎంశర్మ భార్య సంస్ధకు పిపిఇ టెండర్

 భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వివాదం ముదురుతోంది. ఢిల్లీలో ఈడీ కేసులతో మొదలైన వివాదం.. అవినీతి ఆరోపణలకు దారి తీసింది.

ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. ఇటీవలే మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. జైన్ అరెస్టును ఆప్ తీవ్రంగా ఖండించింది ఆప్. రాజకీయ కారణాలతోనే ఈడీని ఉసిగొల్పారని ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. జైన్ అరెస్ట్ తర్వాత కేంద్రంతో ఆప్ వివాదం మరింత ముదిరింది. బీజేపీని టార్గెట్ చేసిన నేతలు.. ఏకంగా ఆ పార్టీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేశారు.

అసోం బీజేపీ ముఖ్యమంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అసోంలో పెద్ద కుంభకోణం జరిగిందని, ముఖ్యమంత్రి కనుసన్నలోనే ఈ స్కామ్ జరిగిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఆరోపించారు. పీపీఈ కిట్ల కొనుగోలులో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. అసోం ముఖ్యమంత్రి హిమంత శర్మ.. తన సతీమణికి చెందిన సంస్థ ద్వారా ఎక్కువ ధరకు పీపీఈ కిట్లు కొనుగోలు చేశారని సిసోడియా ఆరోపించారు. అవే పీపీఈ కిట్లను ఇతర సంస్థల దగ్గర తక్కువ ధరకు అసోం సర్కార్ కొనుగోలు చేసిందని సిసోడియా అన్నారు. ఇందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.

సిసోడియా చెప్పిన వివరాల ప్రకారం సీఎం హిమంత్ శర్మ భార్యకు చెందిన సంస్థ నుంచి అసోం సర్కార్ ఒక్కో పీపీఈ కిట్ ను 990 రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే అదే రోజు ఇతర సంస్థల నుంచి పీపీఈ కిట్లను కేవలం 6 వందల రూపాయలకే కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని... దీని వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందని మనీష్ సిసోడియా చెప్పారు. ఇందుకు సంబంధించి తన దగ్గర అధారాలు ఉన్నాయన్నారు. అవినీతికి సంబంధించిన వివరాలు ఇస్తా... మీ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా అని కేంద్రం పెద్దలను సిసోడియా నిలదీశారు.

సత్యేందర్ జైన్ ను ఈడీ అరెస్ట్ చేసిన వెంటనే స్పందించిన కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మీ నేతల బండారం బయటపెడతానని ప్రకటించారు. అయితే కేజ్రీవాల్ నేరుగా రంగంలోకి దిగకుండా పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా చేత చెప్పించారు. అసోం సీఎం హిమంతపై ఆప్ నేతలు చేసిన ఆరోపణలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. త్వరలో మరికొందరు బీజేపీ నేతలు అవినీతి చిట్టాను బయటపెడతామంటున్నారు చీపురు పార్టీ నేతలు. ఆప్ ఆరోపణలపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.