మహారాష్ట్రలో కొనసాగుతున్న అనిశ్ఛిత రాజకీయం!
అసెంబ్లీ రద్దు అవుతుందన్న సంజయ్ రౌత్
మహారాష్ట్ర శివసేనలో ఏర్పడిన సంక్షోభం ఎటుతిరిగి'అసెంబ్లీ రద్దు' దిశగా మలుపు తిరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో బలనిరూపణకు తాను సిద్ధంగా లేనని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పిన నేపథ్యంలో 'అసెంబ్లీ రద్దు' గురించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది.
ఇదిలా ఉండగా,సిఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తన ట్విటర్ బయో నుంచి 'రాష్ట్ర మంత్రి' అనే పదాన్ని తొలగించారు.
మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడీ కూటమికి కాలం చెల్లినట్లే కన్పిస్తోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం ఖాయమేనని తెలుస్తోంది. 'అసెంబ్లీ రద్దు' గురించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలపై సంజయ్ రౌత్ సంచలన ట్వీట్ చేశారు. "రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. విధాన సభ రద్దు దిశగా సాగుతోంది" అని రౌత్ రాసుకొచ్చారు. దీంతో అఘాడీ కూటమి ప్రభుత్వం నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతకుముందు రౌత్ మాట్లాడుతూ.. "అధికారం తాత్కాలికమైనది. ఇప్పుడు మేం అధికారాన్ని కోల్పోయినా.. మళ్లీ తిరిగొస్తాం" అని వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర మంత్రి, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తన ట్విటర్ బయో నుంచి 'రాష్ట్ర మంత్రి' అనే పదాన్ని తొలగించారు. ఇది కూడా అసెంబ్లీ రద్దు ఊహాగానాలను బలపరుస్తోంది.