పొరుగు దేశాలలో ఆర్ధిక సంక్షోభాలు దేనికి సంకేతం
కుప్పకూలిన శ్రీలంక, అదే బాటలో నేపాల్
పాకిస్థాన్ దారిలోనే బంగ్లాదేశ్
భారతదేశానికి పొరుగున ఉన్న నేపాల్, శ్రీ లంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దదాపుగా ఒకేరకమైన ఆర్ధిక సంక్షోభాలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో భారతదేశంలో పటిష్టంగా ఉన్న కుటుంబ ఆర్ధిక క్రమశిక్షణ వల్లే పరిస్ధితులు చేయిదాటి పోలేదు. అంతర్జాతీయంగా బలమైన శక్తి ఉన్న దేశంగా భారత్ ఆవిర్భ విస్తున్నవేళ ఒకసారి నేపాల్ గురించి పరిశీలన చేస్తే భారత్పై డ్రాగన్ కంట్రీ కొత్త కుట్రలకు తెర లేపిందా? నేరుగా ఢీకొనడం చేతగాక మరో రూట్లో నరుక్కొస్తుందా? అంటే కొద్ది రోజులుగా మన పొరుగు దేశాల్లో నెలకొన్న పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
ఒక పక్క శ్రీలంకలో సంక్షోభం పాకిస్తాన్లో ఇమ్రాన్ సర్కార్ కూలిపోవడం, బంగ్లాదేశ్లో ఆకలి కేకలు, తాజాగా నేపాల్ సైతం ఆర్థిక సంక్షోభం అంచున నిలబడడం వంటి పరిణామాలు చూస్తుంటే డ్రాగన్ కొత్త కుట్రలకు తెరలేపినట్టు కనిపిస్తుంది.
ఒకప్పుడు ఇండియాను పెద్దన్నగా భావించి అన్ని రకాలుగా మద్దతు పొందిన పొరుగు దేశాలు గడిచిన కొన్నేళ్లుగా చైనాను అతిగా నమ్మి కొంపలు ముంచుకుంటున్నాయి. డ్రాగన్ ఆర్థిక మాయాజాలం దెబ్బకు శ్రీలంక తరహాలో నేపాల్ సైతం ఆర్థిక సంక్షోభం అంచున నిలబడి ఉంది. ఇండియా పొరుగుదేశాలు చైనాకు దగ్గరై, ఇబ్బడిముబ్బడిగా అప్పులు పొంది, ఇప్పుడు సంక్షోభ పరిస్థితులను కొనితెచ్చుకున్నాయి.
ఇప్పటికే శ్రీలంకలో పరిణామాలు ప్రమాదకర స్థాయికి చేరగా, నేపాల్ మందమతిలా ఆలస్యంగా కళ్లు తెరిచింది. పాకిస్థాన్ ఎకానమీ బుడగ ఏ క్షణమైనా బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నేపాల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నేపాల్ రాష్ట్ర బ్యాంకు గవర్నర్ మహా ప్రసాద్ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
నేపాల్ చరిత్రలో రాష్ట్ర బ్యాంకు గవర్నర్ను సస్పెండ్ చేయడం ఇది రెండోసారి. విదేశీ ద్రవ్య నిల్వలు తరిగిపోతుండడంతో ఇతర దేశాల నుంచి విలాస వస్తువులు, వాహనాల దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. గత ఏడాది జులై నాటికి 11.75 బిలియన్ డాలర్ల మేర నిల్వలు ఉండగా, ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి నాటికి 9.75 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
నేపాల్ దగ్గర ప్రస్తుతం ఉన్న విదేశీ మారకం నిల్వలు మరో 6 నెలల 3 వారాల అవసరాలకు సరిపోతాయి. అందువల్ల చమురు, ఇతర అత్యవసరాలు మినహా ఇతర వస్తువుల దిగుమతిపై నిషేధం విధించింది. కాగా, నేపాల్లో శ్రీలంక పరిస్థితులు తలెత్తవని ఆర్థిక మంత్రి జనార్దన్ శర్మ చెప్పారు. విదేశీ రుణ భారం తక్కువగా ఉందని, రెవెన్యూ వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నందున ఇబ్బందులు ఎదురవవని తెలిపారు.
భారత్ కు సమీపంగా ఉండే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం దెబ్బకు జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంది. కోపతాపాలు పక్కనపెట్టి భారత్ పెద్దమనసుతో భారీ సహాయం అందిస్తుండటం తెలిసిందే. ఇప్పుడు మరో పొరుగు దేశమైన నేపాల్లోనూ ఆర్థిక సంక్షోభం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటు సంక్షోభ శ్రీలంక.. చైనా సహా విదేశాల నుంచి తీసుకున్న రుణాలను ఇప్పట్లో చెల్లించబోయేది లేదని కుండబద్దలు కొట్టింది. ఇండియాను కాదని చైనాతో అతిగా అంటకాగిన శ్రీలంక, నేపాల్ దేశాలు సంక్షోభం ఉచ్చులో చిక్కుకుపోయాయి. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావొచ్చనే అనుమానాలున్నాయి.