home page

ప్రధాని బోరిస్ కు బుల్డోజర్ సెగ

గుజరాత్ లో జెసిబి ఫ్యాక్టరీలో  దిగిన ఫొటో 

 | 
Boris

ఉత్తరాదిలో ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లను చూస్తే అక్రమార్కులు భయంతో వణికిపోతున్నారు. అయితే, మత ఘర్షణల్లో నిందితుల ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం వివాదాస్పదమవుతోంది. తాజాగా, బుల్డోజర్ సెగ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు తగిలింది. ఇటీవల భారత్‌ పర్యటన సందర్భంగా గుజరాత్‌లో జేసీబీ ఫ్యాకర్టీని బోరిస్ జాన్సన్ ప్రారంభించారు. అనంతరం అక్కడున్న బుల్డోజర్‌పైకి ఎక్కి అభివాదం చేశారు. భారత్‌లో బుల్డోజర్లతో కట్టడాలను ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారిన తరుణంలో జాన్సన్‌ తీరు తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో బ్రిటన్‌ ఎంపీలు జాన్సన్‌ వైఖరిని ఎండగట్టారు.

ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి చెందిన ఎంపీ జారా సుల్తానా మాట్లాడుతూ.. భారత పర్యటన క్రమంలో ఓ వర్గానికి వ్యతిరేకంగా చేపడుతున్న హింసపై మోదీని ప్రశ్నించడంలో బోరిస్ జాన్సన్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. దీనికి బదులుగా జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించడాన్ని బట్టి మానవ హక్కుల విషయంలో జాన్సన్‌ ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతుందని విమర్శించారు.
 


మరో ఎంపీ నదియా విటోమ్‌ స్పందిస్తూ.. ‘బోరిస్ జాన్సన్ ఇటీవల భారత పర్యటనలో జేసీబీలతో ఫోజులిచ్చారు.. అయితే ఇళ్ల కూల్చివేతలపై మోదీతో భేటీలో లేవనెత్తారో లేదో చెప్పలేదు.. బోరిస్ పర్యటనకు ముందు బీజేపీ జేసీబీ బుల్డోజర్లను ఉపయోగించి న్యూఢిల్లీలోని ముస్లిం దుకాణాలు, ఇళ్లు, మసీదు గేటును కూల్చివేసింది.’ అని అన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలకు చట్టబద్ధత కల్పించేందుకు జాన్సన్ భారత పర్యటన దోహదపడిందని అంగీకరిస్తారా? అని ఆమె నిలదీశారు.
 


హనుమాన్ జయంతి రోజున ఢిల్లీలో జహంగీర్‌పూర్‌లో మత ఘర్షణలు చెలరేగి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న తర్వాత.. నిందితుల నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేతలు ప్రారంభించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే బ్రిటన్ ప్రధాని వడోదరలోని జేసీబీ ఫ్యాక్టరీ ప్రారంభించడం గమనార్హం.