ఇక కొన్ని ట్వీట్లు ఉచితంకాదు
ట్విట్టర్లో పలు మార్పులు చేయనున్న ఎలన్ మస్క్
44 మిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చు తో కొనుగోలు
న్యూఢిల్లీ: ట్విట్టర్లో ఇక ఎవరు పడితేవారు ఉచితంగా ట్విట్స్ పోస్ట్ చేయడం సాధ్యం కాదు. కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ప్రభుత్వం, ఇతర సంస్థలు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడానికి కొంమేరకు డబ్బు చెల్లించి సేవలు పొందవచ్చు.
సోషల్ మీడియా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ను తెస్తుంటాయి. సమాజాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యం సోషల్ మీడియాకు ఉన్నది. ఒక అభిప్రాయాన్ని కూడగట్టడంలోనూ సామాజిక వేదికలు కీలక పాత్ర పోషించగలవు.
ఇందుకు ప్రధాన కారణం సోషల్ మీడియా నేడు ప్రతి ఒక్కరికి చేరువకావడం.. అలాగే.. వాటిని ఉచితంగా వినియోగించడానికి ఆస్కారం ఉండటం. కానీ, ఇప్పుడు ఎలన్ మస్క్ ట్విట్టర్పై కొన్ని కొత్త రూల్స్ తెస్తున్నారు. ట్విట్టర్ అందరికీ ఉచితం కాదని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సమీప భవిష్యత్లో ఇతర సోషల్ మీడియాలను బ్రౌజ్ చేయాలన్నా.. ఇలాంటి నిబంధనలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న చర్చ మొదలైంది.
ట్విట్టర్లో ఎలన్ మస్క్ చేసిన ట్వీట్లే ఇందుకు సాక్ష్యం. ట్విట్టర్లో చాలా మార్పులు చేయాల్సి ఉన్నదని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా ట్విట్టర్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండదని వివరించారు. అయితే, క్యాజువల్ యూజర్లకు ట్విట్టర్ ఉచితంగానే అందుబాటులో ఉంటుందని, కానీ, కమర్షియల్ యూజర్లు, ప్రభుత్వ యూజర్లకు చార్జ్ వసూలు చేస్తామని తెలిపారు. ట్విట్టర్ చాలా శక్తిమంతమైనదని, ఒక సత్కార్యానికి వినియోగించడానికి అందులో మార్పులు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
మరో ట్వీట్లో ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్లో ఇతర మార్పులూ చేయాలని యోచిస్తున్నారు. ట్విట్టర్పై విశ్వాసాన్ని పెంచాలని, బాట్స్, స్పామ్, స్కామ్లు లేకుండా చేయాలని తెలిపారు. ఎందుకంటే.. ఒక విషయంపై అది నిజంగా ప్రజా అభిప్రాయమేనా? లేక లక్షల ఫేక్ అకౌంట్ల మాటనా? అనే విషయంపై నమ్మకం కుదరాలి కదా? అంటూ పేర్కొన్నారు.
కేవలం సైట్లోనే కాదు.. స్ట్రక్చరల్ చేంజెస్ కూడా తేవాలని ఎలన్ మస్క్ భావిస్తున్నారు. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ను కూడా తొలగించాలని మస్క్ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే, ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దెను కూడా తొలిగించే అవకాశాలు ఉన్నాయి. ట్విట్టర్ కొనుగోలు డీల్ ఈ ఏడాది పూర్తి అయ్యే వరకు ఈ మార్పులు ఉండకపోవచ్చు. ఆ తర్వాతే ఈ మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.