ఏబివి కేసులో రెండేళ్ళు దాటినా సస్పెన్స్ ఎందుకు పరిష్కారం లేదు
ఏపి ప్రభుత్వం పై విరుచుకుపడ్డ సుప్రీం కోర్టు
Updated: Apr 21, 2022, 12:20 IST
| ఏబి వేంకటేశ్వర రావుపై కొనసాగుతున్న యుద్ధం
దిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.రేపటిలోగా పూర్తి సమాచారంతో కోర్టు కు హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. రెండేళ్లలో సస్పెన్స్ ఎందుకు పరిష్కారం చేయలేదని కోర్టు ప్రశ్నించింది.
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ)పై జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏబీవీపై సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలను పరిశీలించాలని సూచించింది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా.. రెండేళ్ల తర్వాత నిర్దేశాలు అడుగుతారా? అని ప్రశ్నించింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రేపటిలోపు అన్ని వివరాలతో రావాలని.. ఆ తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది.