home page

మహాకవి శ్రీ శ్రీ కవితా జీవితం

జయంతి సందర్భంగా అక్షరాంజలి

 | 
శ్రీ శ్రీ కవితా జీవితం

👉 మహాకవి శ్రీ శ్రీ జయంతి సందర్భంగా...

శ్రీ శ్రీ కవిత్వం - సమీక్షా విమర్శ                 

               ప్రతికవి తాను రాసేది
               తోటివారు మెచ్చుకోవాలనీ ఆశిస్తాడు
               ఆత్మవిశ్వాసం గల కవి మాత్రం
               తన  గీతం జాతి జనులు
               పాడుకొనే మంత్రం
               కావాలనీ కోరుకుంటాడు

                                     కానీ అదీ అందరి కీ సాధ్యం కాదు ఎవరో ఒక మహా కవికీ మాత్రమే ఆ కోరిక తీరుతుంది. అలాంటి కవి యే శ్రీరంగం శ్రీనివాస రావు!

               తెలుగు సాహిత్యానికి దశ దిశ నిర్దేశించిన శ్రీశ్రీ  పట్ల, అతని బంధువు, సమగ్రాంధ్ర సాహిత్య నిర్మాత, విమర్శకుడు, పరిశోధకుడు, కవి అయిన ఆరుద్ర  ప్రతిస్పందించారో గమనిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆరుద్ర, శ్రీశ్రీ బంధువులు. ఇద్దరూ కొన్నాళ్లు మద్రాసులో కలిసి బతికినవారు. మార్క్సిస్టు జెండాల్ని మోసి ఎత్తుకు తిరిగిన వారే! అయితే ఆరుద్ర కు శ్రీశ్రీ కీ అభిప్రాయ భేదాలున్నట్లు తెలుస్తుంది. ఆరుద్ర  శ్రీశ్రీ రచనల పట్ల కొన్నీ అభ్యంతరాలు లేవనెత్తారు. వాటిని చూస్తే

                    1920 లో ప్రచురితమైన భారతి పత్రిక యొక్క ప్రాచుర్యం ఎంత గొప్పదంటే ఆరుద్ర గారి మాటలలో చెప్పాలంటే " *భారతి లో పద్యం అచ్చు అయ్యిందంటే కవిగా జాగా దొరికిందనీ అర్ధం. కథ పడిందంటే లోకం నిన్నూ గుర్తించిందనీ అర్దం. విమర్శ వ్యాసం అచ్చు అయ్యిందంటే నీ అభిప్రాయాలు విలువైనవి అన్నమాట. అదే ఆ పత్రిక నిన్ను మెచ్చుకోందంటే ఆ రచయిత గొప్పవాడనీ అర్దం*"

                     అలాంటి మంచి పత్రిక లో శ్రీశ్రీ తొలి రచన " *సమరాహ్వనము* అచ్చయినది. కానీ ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే భారతి లో అచ్చయిన ఫేలవయిన రచన ఇది. ఎందుకంటె ఇది తిరుపతి వెంకట కవుల సుప్రసిద్ధ నాటకం " *పాండవ విజయం* " లోని 7 వ అంకం కు అనుసరణం అనీ ఆరుద్ర అంటారు.

                   శ్రీశ్రీ 1925-28 వరకు రాసిన 16 ఖండికలను ఒకచోట చేర్చి అదే సంవత్సర తెలుగు నామం పేరుతో " *ప్రభవ* గా పుస్తకం విడుదల చేసారు. ఇది భావకవిత్వమే అయినా ప్రేయసి పరంగా కాకుండా పరమేశ్వరుని పరంగా రాసిన కవితలు .నాస్తికుడైన కవి ఇలాంటివి రాయడం ఆస్తకీకరం. ఆ కాలంలోనే కొంపెల్లి జనార్దన్ రావు తో పరిచయం ఏర్పడింది. ఇతని ద్వారానే శ్రీశ్రీ ఎంతో మంది కవులను పరిచయం చేసుకున్నారు. మంచి మిత్రులు గా పేరు తెచ్చుకున్నారు. కానీ జనార్దన్ గారు తమ స్నేహన్నికీ విమర్శ కు అడ్డు రానివ్వలేదు. అందుకు ఉదాహరణ ప్రభవ రచన ను సమీక్షిస్తు " *ప్రభవ శైలి బాగున్నా తెలుగు వాడకం తక్కువ వుంది. పైగా కృష్ణశాస్త్రి ; విశ్వనాథ ల ప్రభావం తో రాసినట్టు వుంటూ సొంత గొంతుక లేదనీ* శ్రీశ్రీ ని జనార్దన్ రావు గారు విమర్శించారు. 

                  ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య 13వ సంపుటిలో శ్రీశ్రీ కవిత్వం పట్ల ఆరుద్ర చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం. అలాగే  'గురజాడ గురుపీఠం'లో  " సంకల్పం " శీర్షికతో ముందు మాట రాసుకొంటూ శ్రీశ్రీ ని దృష్టి లో వుంచుకొని *జాఢ్యం ముదిరినవాడు తానే ఆద్యుడనుకొంటాడు* అనీ రాసారు. 

            ఇంకా చెప్పాలంటే  శ్రీశ్రీ ఒకానొక సందర్భంలో 
" *1939 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాననీ*"  చెప్పుకున్నారు. ఆ విషయం పై ఆరుద్ర 1972 లో " పాతికేళ్ళ సాహిత్యం " అనే వ్యాసం లో 
 " *బండిచక్రం మీదనున్న ఈగ ఆ బండిని తానే కదిలిస్తాననుకొంటుంది* " అంటూ ఘాటైన విమర్శ ను చెసారు. 

*కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తో శ్రీశ్రీ స్పర్థ*

శ్రీశ్రీకి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు మధ్య గల స్పర్థ ప్రసిద్ధమైనది. విశ్వనాథ సత్యనారాయణ అంటే శ్రీశ్రీకి ఒకవిధమైన గురుభావం ఉండేది. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన సమయంలో ఆయనపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం చాలా గాఢంగా ఉంది. ఆయన శైలిలో కవిత్వం రాయాలని తీవ్రమైన ప్రయత్నం చేసేవారు. తాను మద్రాసులో ఉన్న రోజుల గురించి చెప్తూ:మదరాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించినవారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కుళాయి వాళ్లు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు అని చెప్పుకున్నారు. 
                  విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షం గొప్ప రచన కాదని శ్రీశ్రీ అభిప్రాయం. దీనిని వెక్కిరిస్తూ ఒక్కడైనా రామాయణ కల్పవృక్షం చదివానంటే విశ్వనాథ పొంగిపోతాడనీ, సంస్కృతం రాకున్నా వాల్మీకం అర్థమైంది గానీ తెలుగు వచ్చినా కల్పవృక్షం అర్థంకాలేదని చాలాచాలా మాటలే మాట్లాడారు.
           విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పడం కోసం, 'సంస్కృతంలో విశ్వనాథ కంటే గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప పండితుడు' అని ప్రకటించాడు శ్రీశ్రీ.
                 తనంతటి మహాకవి వెయ్యేళ్ళ వరకూ పుట్టడని విశ్వనాథ తన గురించి తానే ప్రకటించుకోగా,శ్రీశ్రీ నిజానికాయన వెయ్యేళ్ళ కిందటే పుట్టాడని అన్నాడు.
                    ఈ వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశారు. ఈ ఆరోపణ ప్రత్యారోపణలు వారిద్దరి నడుమ సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతీశాయి. మళ్ళీ విశ్వనాథను నన్నయ ఉన్నంతకాలం ఉంటారని, ఐతే తిక్కన-వేమన-గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలూ చేశారు.
         ఇలా కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడమూ, ఒక్కోమారు బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడమూ, తుదకీ అనురాగం-ద్వేషాల దాగుడుమూతలాట సాగింది.

                శ్రీశ్రీ రచించిన రచనలు అన్నీ ఒక ఎత్తు అయితే ఆతని *మహా ప్రస్థానం* కవితా సంపుటి ఒక యెత్తు. శ్రీశ్రీ గురించి సరిగ్గా తెలియని వారు సైతం మహాప్రస్థానం లోని గీతాలు పాడేవారు అదీ దాని ప్రభావం. 1933-47 దాకా రాసిన మహా ప్రస్థాన గీతాలు శ్రీశ్రీ తన జీవిత కాలం లో కూడా రాయలేనంత గొప్ప రచనలు.అలాంటి మహా ప్రస్థానం గీతాలపై ఆరుద్ర గారి విమర్శ ను చూద్దాం...

                       శ్రీశ్రీ గారు రాసిన  "మహాప్రస్థానం"  గీతానికి నజ్రల్‌ ఇస్లామ్‌ కవితా, హరీన్‌ రాసిన ' *షురూ హువా హై జంగ్‌* అనే పాటా, మరియు శిష్ట్లా రచించిన ' *మారో - మారో - మారో*' అనే పాటా ప్రోద్బలాలనీ  ఆరుద్ర అన్నారు.కానీ శ్రీశ్రీ వాటిని ఎక్కడ చెప్పలేదని విమర్శించారు.
              *దేశభక్తి* అనే గీతం గురజాడ గారికి ఎంత పేరు తెచ్చిందో  శ్రీశ్రీ కీ " *దేశచరిత్రలు*" అనే కవిత అంతే పేరు తెచ్చింది.కానీ గురజాడ గీతం పై ఎలాంటి ఆరోపణలు లేవు కానీ శ్రీశ్రీ పై నార్ల వేంకటేశ్వర్లు లాంటి వారు కొన్నీ ఆరోపణలు చేసారు. శ్రీశ్రీ గారి దేశచరిత్రలు ఇలా ఉంటుంది. *తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళేత్తిన కూలీలేవ్వరు..??* ఈ పంక్తులపై జర్మన్ కవి బెర్తోన్ బ్రేహ్ట్ రాసిన *ఎ వర్కర్ హు రీడ్స్ హిస్టరీ* అనే గేయం ప్రభావం వుంది. ఆ గేయం చూస్తే

         *ఎవరు కట్టారు నైలు గట్టున*
          *ఏడు గేటుల ధిబిస్ నగరం*
           *పుడమి నేలిన వాళ్ళ పేర్లు*
           *పుస్తకాలల్లో మీరు చూస్తారు*
            *రాజులే ఆ రాళ్ళు మూపున*
             *మోసుకెళ్ళారా*

                     ఈ  కవిత ప్రభావం శ్రీశ్రీ దేశచరిత్రలు కవిత పై ఉందనీ కానీ ఈ విషయం శ్రీశ్రీ గారు పేర్కొనలేదనీ నార్ల గారి ఆరోపణ.

               శ్రీశ్రీ మరో కవిత " కళారవి "ని చూస్తే...

               *పోనీ పోనీ*
               *పోతేపోనీ*
               *సుతుల్ సుతుల్ హితుల్ పోనీ*
              *పోతే పోనీ*
              *రానీ ....రానీ*
               *వస్తే రానీ*
               *కష్టాల్ నష్టాల్*
               *కోపాల్ తాపాల్ శాపాల్ రానీ*
                 *వస్తే రానీ*

                    ఇదీ అన్నమాచార్యుల సంకీర్తన ప్రభావం ఉందనీ ఆరుద్ర గారు అంటారు. ఆ కీర్తన చూస్తే...

       *నేనెందువోయెతావెందు వోయె*
          *రానీలె రానీలె రానీలె*
          *మీనైన వంటి తన మిడు కెల్ల దిగవలె*
           *కానీలె కానీలె కానీలె*
            *మానైన నాటి మదమెల్ల దిగవలె*
             *పోనీవె పోనివె పోనీవె*

                1922 లో ఉన్నవ లక్ష్మి నారాయణ గారు " మాలపల్లి " అనే నవల రాసారు.అందులో విప్లవాన్ని జగన్నాథుని రథ చక్రాలతో పొల్చుతు కొన్నీ వాక్యాలు కలవు. అలాగే అరవిందయోగి గారు కూడా భగవంతుని వాహనంగా జగనాథ రథ చక్రాల ప్రస్తావన వచ్చింది. ఆ ప్రభావంతోనే  శ్రీశ్రీ *జగన్నాథ రథచక్రాలు* అనే కవిత రాసి ఉండవచ్చు అనీ ఆరుద్ర గారి ఊహ

         *నేను సైతం*
          *ప్రపంచాగ్నికీ*
          *సమిధనొక్కటి ఆహుతిచ్చాను*

                      క్రోపాట్కిస్ అనే ఆంగ్ల కవి విప్లవ సందేశం గురించి చెబుతూ " *ఏ దేశ చరిత్రలోనైన స్వలాభం కొసం చేసే దారుణ యుద్దాలు మరేమున్నాయి. అక్కడ ఇక్కడ అనేమి చైనాలో ఇండియా లో ఇటలీలో పీడించేవాళ్లు ప్రతి ప్రదేశంలో ఉన్నారు*" అనీ వ్యాసం రాసారు. ఇదే విషయ భావంతో శ్రీశ్రీ గారు ఇలా రాసారు.

        " *ఏ దేశ చరిత్ర చూసినా*
          *ఏమున్నది గర్వకారణం*
           ---------------------
           ---------------------
          *చైనా రిక్షా వాలా*
          *చెక్ దేశపు గని పనిమనిషి*
           *అణగారిని ఆర్తులందరు*
            *ఖండాంతర నానాజాతులు*

                  
*లండన్ ప్రొగ్రేసివ్ రైటర్స్ మెనిఫేస్టో* ను శ్రీశ్రీ చదివి యధావిధిగా ఒక కవిత    రాసారు *పోలాలన్ని హలాలదున్ని* అంటూ ప్రతిజ్ఞ అనే గేయం రాసారు.దీనిని చూసీ అబ్బూరి రామకృష్ణ రావు గారు ఆశ్చర్యపడి శ్రీశ్రీ తో *ఆ మెనిఫేస్టోను అలా దించేసావే* అంటూ శ్రీశ్రీని ప్రశ్నించారు.

       *పరస్పరం సంఘర్షించిన*
         *శక్తులలో చరిత్ర పుట్టును*           అనీ శ్రీశ్రీ గారు ప్రకటించారు.

                శ్రీశ్రీ కవిత్వం ను ఎత్తి చూపడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు. ఇలాంటి ఆస్తకీకరమైన చర్చలు వివాదాలు సాహిత్య విమర్శ కు కొత్త కోణంను హేతుబద్ధతను చూపెట్టాయి అనీ చెప్పడం. మరియు ఏ కవి అయిన ఎవ్వరి ప్రభావం లేకుండా కవి గా రాణించ లేరనేది సత్యం. అలాగే ఆ ప్రభావం నుండి బయటపడి మహా కవులు గా మారడం ఇక్కడ గొప్ప విషయం....                                                                                                 ఐ.చిదానందం