home page

రుషికొండ కోసం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన జగన్ సర్కారు

ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో పిటీషన్

 | 
Rushikonda

రుషికొండ ను పిండేసిన

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

విశాఖ రుషి కొండ తవ్వకాల అంశంలో తాజాగా ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే..రుషికొండలో తవ్వకాలు చేపట్టినట్లు జగన్ సర్కార్ స్పష్టం చేసింది. పర్యావరణానికి ఎలాంటి హాని కల్గకుండా..తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్‌లో తెలిపింది.

విశాఖలో రుషి కొండ తవ్వకాలపై ఇటీవల ఎన్జీటీ ధర్మాసం స్టే విధించింది. తాజాగా దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లింది. రుషికొండ తవ్వకాలపై ఎంపీ రఘురామకృష్ణరాజు గతేడాది ఎన్జీటీకి ఆశ్రయించారు. దీనిపై పలుమార్లు విచారణ జరిగింది. ఇటీవల ఈనెల 6న ఎన్జీటీలో విచారణ కొనసాగింది. రుషికొండ తవ్వకాలపై స్టే విధించింది. తవ్వకాలను తక్షణమే ఆపాలని స్పష్టం చేసింది.

రిషికొండ తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు సంయుక్త కమిటీని ఎన్జీటీ నియమించింది. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి తవ్వకాలు చేయవద్దని స్పష్టం చేసింది. రుషికొండ తవ్వకాలపై త్వరలో సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. సర్వోన్నత న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం అంటోంది.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం..మూడు రాజధానులను తీసుకొచ్చింది. విశాఖను పరిపాలన, కర్నూలును న్యాయ, అమరావతిని శాసన రాజధానిగా మార్చుతూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బిల్లును మళ్లీ వెనక్కి తీసుకుంది. త్వరలో అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల బిల్లు రానుంది. ఆ దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు విశాఖను అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగానే రుషికొండపై తవ్వకాలు చేపడుతోంది. విశాఖను మహానగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం అంటోంది. రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతి ఉండాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిమాండ్ చేస్తోంది.