అమరావతి రైతులతో చర్చల ప్రసక్తి లేదని స్పష్టం చేసిన మంత్రి బొత్స
సచివాలయంలో ఎలా వస్తారో చూస్తాం: అమరావతి జేఏసి
రాజధాని అమరావతి రైతులతో చర్చల ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
బొత్స సత్యనారాయణ కేవలం తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి, సీఎం జగన్మోహన్రెడ్డి మెప్పు పొందడానికి రాజధాని ప్రాంత రైతుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరో రెండు నెలల్లో బొత్స మంత్రి పదవి ఉంటుందో.... ఊడిపోతుందో తేలిపోతుందన్నారు. దాన్ని నిలబెట్టుకోవడానికే ఆయన అమరావతిపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఉంటూ రైతులను చర్చలకు పిలిచేది లేదనడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతిలో ఓ సామాజిక వర్గం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లేదంటే ఆయన సచివాలయానికి ఎలా వస్తారో చూస్తామని దళిత జేఏసీ నేతలు హెచ్చరించారు.