home page

భాగ్యలక్ష్మి ఆలయంలో సోనియా ఆరోగ్యంపై కాంగ్రెసు నేత పూజలు

చార్మినార్ వద్ద హడావుడి 

 | 
భాగ్యలక్ష్మి

సోనియా త్వరగా కోలుకోవాలని పూజలు

కాంగ్రెస్ నేతలు వీహెచ్, భట్టి విక్రమార్క, సీతక్క తదితరులు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు కరోనా నుంచి సోనియా గాంధీ కోలుకోవాలని పూజలు చేశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు హిందువులందరికీ దేవత అన్న కాంగ్రస్ నేతలు.. బీజేపీ నేతల తీరును తప్పుబట్టారు. గురువారం బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య భాగ్యలక్ష్మీ ఆలయం విషయమై మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దర్శనం అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీజేపీ రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని ఆరోపించారు. హిందువులకు పరమత సహనం ఉంటుందని ఆయన తెలిపారు. చార్మినార్, భాగ్యలక్ష్మీ ఆలయం అందరివని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడమైన చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మీ ఆలయం ఉంటుంది. ఈ రెండు కట్టడాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. బండి సంజయ్ సహా బీజేపీ నేతలు తరచుగా ఇక్కడి ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 2020 నవంబర్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా సైతం ఇక్కడ పూజలు నిర్వహించారు. కాగా చార్మినార్‌లో నమాజ్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ కార్యదర్శి రషీద్ ఖాన్ సంతకాల సేకరణ ప్రారంభించారు.

ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్న చార్మినార్‌‌లో గతంలో ముస్లింలు నమాజ్ చేసేవారని, రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ నమాజ్‌ చేయడంపై నిషేధం విధించారని రషీద్ ఖాన్ చెబుతున్నారు.

రషీద్ ఖాన్ సంతకాల సేకరణపై బీజేపీ ఘాటుగా స్పందించింది. హిందువులు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటే.. మీకు నమాజ్ గుర్తొచ్చిందా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. భాగ్యలక్ష్మీ ఆలయంపై చేయి వేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌కు అంత దమ్ముందా అని సంజయ్ సవాల్ చేశారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి డ్రామాలు ఆడుతున్నాయని సంజయ్ ఆరోపించారు. చార్మినార్ వద్ద అమ్మవారి గుడి లేదని చెప్పేవాడు మూర్ఖుడు అని మండిపడ్డారు.

బీజేపీ నేతల విమర్శల పట్ల కాంగ్రెస్ నేతలు సైతం గట్టిగానే స్పందించారు. చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం అందరివని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. భాగ్యలక్ష్మి ఆలయం తమ సొంతం అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడం మానేయాలని విక్రమార్క హితవు పలికారు.