ప్రాణహిత పుష్కరాలకు కనీస సౌకర్యాలు కల్పించరా?
కేంద్ర మంత్రి మురుగన్ అసంతృప్తి
మహారాష్ట్ర 10 కోట్లు ఇచ్చింది, మరి తెలంగాణ ఎంత ఇచ్చింది
*ప్రాణహిత పుష్కరాలకు కనీస సౌకర్యాలు కల్పించరా ?*
తెలంగాణ సర్కారుపై కేంద్ర మంత్రి మురుగన్ వ్యాఖ్యలు
ఆసిఫాబాద్, ఏప్రిల్ 17 : ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలను కల్పించకపోవడం విచారకరమని కేంద్ర సమాచార, ప్రసార, మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ అన్నారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం పొరుగున ఉన్న మహారాష్ట్ర రూ.10 కోట్లు కేటాయిస్తే.. తెలంగాణ సర్కారు మాత్రం ఎటువంటి సదుపాయాలను కల్పించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు ‘ఆస్పిరేషనల్’ జిల్లాల సమీక్షలో భాగంగా కేంద్రమంత్రి మురుగన్ ఆదివారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, భక్తుల మనోభావాలతో తెలంగాణ సర్కారు ఆడుకోవటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను కూడా రాష్ట్ర సర్కారు పట్టించుకోకపోవడం శోచనీయమని చెప్పారు. అనంతరం ఆయన ‘అడ’ జల ప్రాజెక్టును సందర్శించారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న సినిమా థియేటర్ను సందర్శించారు. మహిళా సంఘాలు థియేటర్ను నిర్మించి విజయవంతంగా నడపడం దేశంలో ఇదే మొదటిసారి అని చెప్పారు.