home page

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి: కేసీఆర్ పిలుపు

ఏక్నాధ్ షిండేలను ప్రయోగిస్తారా? రండి చూసుకుందాం!

 | 
kcr campaign in varanasi
దేశాన్ని భాజపా జలగలాగా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రధాని మోదీ పై విరుచుకుపడ్డారు. ”ఇటీవల భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో పెట్టారు. ఆ సమావేశాల్లో గతంలో సాధించిన విజయాలు, చేయబోయే కార్యక్రమాల గురించి సందేశం ఇవ్వాలి. కానీ, ప్రధానమంత్రి ఏం మాట్లాడారో భగవంతునికే ఎరుక. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో యశ్వంత్‌ సిన్హా వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీని నేను కొన్ని ప్రశ్నలు అడిగా. తెరాస అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా మోదీ, మంత్రులు సమాధానం చెప్పలేదు. వారి డొల్లతనాన్ని బయటపెట్టారు. తెలంగాణ గురించి భాజపా సభలో ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ప్రధాని మోదీ అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారు”
”మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి విలువ పతనమైందని గొంతు చించుకుని చెప్పారు. ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో ఆయనే చెప్పాలి. గతంలో మోదీ చెప్పిన విషయాన్నే ఇప్పుడు మేమూ అడుగుతున్నాం. భాజపా అసమర్థత వల్లే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.80కి పడిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మోదీ హయాంలో రూపాయి విలువ పతనమైంది. దేశానికి మోదీ చేసిన మంచి పని ఒక్కటైనా చెప్పగలరా? తెలంగాణ తప్ప దేశమంతా చెడ్డ పవర్‌ పాలసీ తీసుకొచ్చారు. సాగునీరు ఇవ్వలేరు, తాగునీరు ఇవ్వడం చేతకాదు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇవ్వడం కూడా చేతకాదా? దేశ రాజధానిలో కరెంటు కోతలు, మంచినీటి కొరత ఉంది. ఇదే మీ పాలనకు నిదర్శనం. తెలంగాణలో జరిగే అభివృద్ధిలో కనీసం 10శాతమైనా భాజపా పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందా?అసమర్థ విధానాల వల్ల దేశాన్ని ఆగం పట్టించారు. రూపాయి పతనం ఆపలేరు, నిరుద్యోగాన్ని కట్టడి చేయలేరు. లొల్లి పెట్టడం ఒక్కటే మీక చేతనైంది”
”భాజపా పాలన అంతా అప్రజాస్వామిక విధానాలు, అవినీతి, కుంభకోణాలమయం. కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు నష్టపోయింది. అసెంబ్లీలో ఇదే విషయం చెప్పా. దేశంలో ఏటా కోటి 30లక్షల ఉద్యోగాలు కోల్పోతున్నారు. వీళ్ల చేతగాని తనాన్ని ప్రజలు చూశారు. అందుకే కేంద్రంలోని ప్రభుత్వం మారాలని చెబుతున్నాం. తప్పకుండా మారుస్తాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని మోదీ చెప్పారు. ఈ విషయంలో మోదీకి థ్యాంక్స్‌ చెబుతున్నా. తెలంగాణ సర్కారు ఇంజిన్‌ స్పీడ్‌గా ఉంది. కాబట్టే కేంద్రంలో కూడా తెలంగాణ సర్కారులా స్పీడ్‌గా ఉన్న ప్రభుత్వం రావాలి. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ జీడీపీ 128.3శాతం ఉంటే కేంద్ర ప్రభుత్వం జీడీపీ 89.6శాతంగా ఉంది”
కట్టప్పా.. కాకరకాయా? ఏం చేస్తారు?
”కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పోవాలి.. భాజపాయేతర ప్రభుత్వం రావాలి. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే తెలంగాణ జీడీపీ ఇంకా పెరుగుతుంది. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తాం. అలాంటి ప్రభుత్వం తెలంగాణలో మాకెందుకు? కేంద్ర ప్రభుత్వం వేగం తక్కువ.. రాష్ట్ర ప్రభుత్వం వేగం ఎక్కువ. కేంద్రంలో తప్పకుండా భాజపాయేతర డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సి ఉంది. భాజపా నేతలకు అహంకారం పెరిగింది. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లున్న చోట ఏక్‌నాథ్‌ శిందే వస్తారా? తెలంగాణలో మూడోవంతు మెజార్టీతో తెరాస గెలిచింది. ఇదేనా మీ పాలసీ. నుపుర్‌ శర్మ వ్యాఖ్యలతో విదేశాల్లో భారత రాయబారిని నిలదీస్తే క్షమాపణ చెప్పారు. భాజపా అసమర్థ విధానాల వల్ల భారత్‌ పరువుపోతోంది. సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని విశ్రాంత జడ్జిలతో లేఖ రాయిస్తారా?భాజపా నేతలు సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయట్లేదు. ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు. కట్టప్పలా.. కాకరకాయా? కట్టప్పలు, ఏక్‌నాథ్‌ శిందే.. ఇలాంటి కుక్కమూతి పిందెలా రాష్ట్రానికి కావాల్సింది? ఏక్‌నాథ్‌ శిందే వచ్చి ఏం చేశారు? మహారాష్ట్రలో 20శాతం విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. మీ వల్ల ఏమవుతుంది. మన్నూ మశానం తప్ప”
దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి
”ప్రముఖ విలేకరులను నక్సలైట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తామని బాహాటంగా చెబుతున్నారు. మీ ఉన్మాదం.. పిచ్చి ఎక్కడిదాకా పోతుంది? తెలంగాణ రైతులను అవమానించేలా కేంద్ర మంత్రి గోయల్‌ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నూకలు ఎక్కువగా వస్తాయంటే.. అవే తినాలన్నారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి… అంతకంటే గొప్ప?పంటలకు సంబంధించి కేంద్రానికి ఏమైనా విధానం ఉందా? భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు బీమా అమల్లో ఉందా? వాణిజ్య, వ్యవసాయశాఖకు సమన్వయం లేదని భారతీయ కిసాన్‌సంఘ్‌ చెప్పింది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత అత్యయికపరిస్థితి నడుస్తోంది. సర్కారు నడుపుతున్నారా? గూండాయిజం చలాయిస్తున్నారా? మోదీకి తెలియకుండా బ్యాంకు లూటీలు జరగట్లేదు. బ్యాంకులను దోపిడీ చేసిన వారిని వెనక్కి రప్పించలేకపోతున్నారు. ఇప్పటివరకూ వరకూ ఒక్క దొంగనైనా పట్టుకున్నారా? మోదీ గారూ.. బ్యాంకు దొంగల్ని మీ ఈడీలు, సీబీఐలు పట్టుకోవా? బ్యాంకు దొంగలను పట్టుకోవట్లేదంటే మీరు కూడా భాగస్వామ్యమే. అన్ని వివరాలను ప్రజలముందు ఉంచుతాం” అంటూ సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
FacebookTwitter
Previous article
పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న వారికే టిక్కెట్లు:కోమటిరెడ్డి